శరీరంలో వేడి అస‌లు ఎలా వస్తుంది..? వేడి త‌గ్గేందుకు ఏం చేయాలి..?

శరీరంలో వేడి అస‌లు ఎలా వస్తుంది..? వేడి త‌గ్గేందుకు ఏం చేయాలి..?

 

వేస‌వి కాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లలో మ‌న శ‌రీరంలో వేడి చేయ‌డం ఒకటి. మ‌న‌లో కొంద‌రు గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి కాయ‌, గోంగూర, ఆవ‌కాయ వంటి వాటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేయ‌డం వంటిది జ‌రుగుతుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో నిరంత‌రం క‌ణ‌జాలం నుండి శ‌క్తి ఉత్ప‌త్తి అవుతూ ఉంటుంది. శ‌క్తి ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల వ‌చ్చే వేడి (ఉష్ణోగ్ర‌త‌) మ‌న శ‌రీరంలో సాధార‌ణంగా 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ వ‌ర‌కు ఉంటుంది.

క‌ణ‌జాలంలో ఉండే నీరు ఈ ఉష్ణోగ్ర‌తను పెరగ‌కుండా, త‌గ్గ‌కుండా నియంత్రిస్తుంది. మ‌నం నీటిని స‌రిగ్గా తాగ‌న‌ప్పుడు క‌ణ‌జాలంలో ఉండే నీటి శాతం త‌గ్గి శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది. ఈ స్థితినే వేడి చేయ‌డం అంటారు. క‌ళ్లమంట‌లు, త‌ల‌నొప్పి, మూత్రంలో మంట‌, శ‌రీరానికి వేడి త‌గిలిన‌ప్పుడు శ‌రీరం మండిన‌ట్టు అనిపించ‌డం, మూత్రం వేడిగా రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు..

శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు మ‌నం చూడ‌వ‌చ్చు.క‌నుక వేడిని త‌గ్గించే చ‌ర్య‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. వేడి చేసిన‌ప్పుడు చ‌లువ చేసే ప‌దార్థాల‌ను తీసుకుంటూ, వేడి చేసే ప‌దార్థాల‌ను తిన‌కుండా ఉంటూ శ‌రీరాన్ని స‌మ‌స్థితికి తీసుకురావ‌డం చాలా అవ‌స‌రం. మ‌నం తీసుకునే ఆహారాల్లో పులుపు, అల్లం, మ‌సాలాలు, నూనె ఎక్కువ‌గా వాడిన ప‌దార్థాలు, ప‌చ్చ‌ళ్లు వేడి చేసే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి.

ఉద‌యంపూట మ‌నం తీసుకునే అల్పాహారాలు దాదాపు వేడి చేసేవే అయి ఉంటాయి. చివ‌రికి ఇడ్లీని కూడా కారం పొడి, అల్లం చ‌ట్నీ వంటి వేడి చేసే ప‌దార్థాల‌తో క‌లిపి తింటూ ఉంటాం. ఇక త‌ర‌చూ వేడి చేస్తుంది అంటే వేడి శరీర‌త‌త్వం ఉంద‌ని అర్థం. ఇలాంటి వారు పులుపు, అల్లం వెల్లుల్లి వాడ‌కాన్ని ఎంత త‌గ్గిస్తే అంత మంచిది. చింతపండు వేయని ప‌ప్పు చారు, సాంబార్ ను వాడాలి. వేడి శ‌రీరత‌త్వం ఉన్న‌వారు పెస‌ర‌క‌ట్టు, కందిక‌ట్టు వాటిని తీసుకోవాలి. అలాగే పుచ్చ‌కాయ‌, కర్బూజ‌, దానిమ్మ‌, క‌మ‌లాపండ్లు, కీర‌దోస వంటి వాటిని తీసుకోవాలి.

కాఫీ, టీ, ఆల్క‌హాల్ కూడా వేడి చేస్తాయి. మ‌జ్జిగ చ‌లువ చేస్తుంది. ఉప్పు, కారం, పులుపు రుచులు వేడిని పెంచుతాయి. తీపి, వ‌గ‌రు రుచులు చ‌లువ చేస్తాయి. సొర‌కాయ చ‌లువ చేస్తుంది. కానీ వేడి చేసే పులుసు వేసి పులుసు కూర చేయ‌డం వ‌ల్ల సొర‌కాయ కూడా వేడి చేసేదిగా మారిపోతుంది. క్యారెట్, ముల్లంగి, ఆపిల్ వంటి వాటిని జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా వేడి త‌గ్గుతుంది. ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, శొంఠి.. ఈ మూడింటిని స‌మానంగా తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లుపుకుని తాగాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల వేడి త‌గ్గుతుంది. చింత‌పండు వేడి చేస్తుంది క‌నుక దీనికి బ‌దులుగా ట‌మాట‌, ఉసిరికాయ‌ల‌ను వాడుకోవాలి.

 

వేడి చేసే స్వ‌భావం ఉన్న వ్య‌క్తులు ఉద‌యం పూట టిఫిన్ ల‌కు బ‌దులుగా పెరుగ‌న్నం తిన‌డం ఎంతో శ్రేష్ట‌మైన‌ది. పులుపు లేని పండ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. స‌బ్జా గింజలను నీటిలో నాన‌బెట్టి గింజ‌ల‌తో స‌హా ఆ నీటిని తాగితే చ‌లువ చేస్తుంది. అలాగే సుగంధి పాల వేర్లు మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ల‌భ్య‌మ‌వుతాయి. ఈ వేర్ల‌పై ఉండే బెర‌డును పొడిగా చేసి నీళ్లల్లో కానీ, పాల‌ల్లో కానీ క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల కూడా వేడి త‌గ్గుతుంది. వేడి చేసిన‌ప్పుడు లేదా వేడి శ‌రీరత‌త్వం ఉన్న‌వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *