విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

ఏపీ  విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై ధర్మాన మండిపడ్డారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలన్నారు. 60ఏళ్లుగా చెన్నైలో రాజధాని ఉన్నపుడు అక్కడికి వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించామని, తర్వాత కర్నూలు రాజధాని చేస్తే 600-700 కిలోమీటర్లు వెళ్లారని, ఆ తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్‌ వెళ్లారని, ఇన్నేళ్లకు రాజధాని విశాఖ వస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కోపమని ప్రశ్నించారు.

అమరావతి రైతులు పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర ప్రజల పీక కోయడానికి వస్తున్నారని ధర్మాన ఆరోపించారు. ఎవరని ఆహ్వానించాలో, ఎవరిని తిరస్కరించాలో ఉత్తరాంధ్ర ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు దొంగ ఎత్తులు వేస్తున్నారని, ఇన్నేళ్ల తర్వాత రాజధాని విశాఖ వస్తుంటే చంద్రబాబుకు కోపం ఎందుకని ధర్మాన ప్రశ్నించారు.



మేం పుట్టిన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందకూడదని ధర్మాన నిలదీశారు. ఉత్తరాంధ్ర పీక కోయడానికి వస్తున్న వారికి బుద్ది చెప్పాలన్నారు. విశాఖ రాజధాని అడ్డుకునే వారందర్ని రాజకీయంగా బహిష్కరించాలని ధర్మాన పిలుపునిచ్చారు. విశాఖ రాజదాని ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామాకు సిద్దమని మంత్రి ధర్మాన ప్రకటించారు.

భూములకు ధరలు రావాలని, రియల్ ఎస్టేట్ కావాలని అమరావతి రైతులు ఆందోళన చేస్తే అర్దముందని ఎద్దేవా చేశారు. అమాయకమైన రైతులకు పెట్టుబడి పెట్టి మరీ అరసవల్లి తీసుకొస్తున్నారని, మీకు రాజదాని వద్దు, మీ బ్రతుకులు ఇలాగే ఉండాలని అమరావతి నుండి ఇక్కడి కి వచ్చి చెపితే అంగీకరించే పరిస్థితి ఉంటుందా అని ధర్మాన ప్రశ్నించారు.

పనులు కోసం పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు వలస వెళ్లి శవాలై వచ్చే పిల్లల సమస్యలు ఇంకా చంద్రబాబు దృష్టికి రాలేదేమోనన్నారు. మా గడ్డ మీదకు వచ్చి మాకు రాజదాని వద్దు అని చెప్పే దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు తెగించి ముందుకు రావాలని, ఇరుగు పొరుగు వారిని సంఘటితం చేయాలన్నారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

జిల్లా వాసులు, ముఖ్యమంత్రి అనుమతిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి.. విశాఖ రాజధాని ఉద్యమం ప్రారంభించి ఉద్యమంలోకి వెళ్తానన్నారు. ప్రాంతం కోసం పోరాడే గోప్పఅవకాశం సిఎం నాకిస్తే ముందుకు వెళ్తానన్నారు. మంత్రిగా ఉండటం కంటే సామాన్యుడిగా ఉద్యమిస్తే నా వెనుక లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రతీ ఒక్క పౌరుడిని సంఘటితం చేస్తామని చెప్పారు.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *